తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫల, ఫుష్పాలంకరణను ఏర్పాటు చేసింది. ఈ ఫల, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీ మలయప్ప స్వామివారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.
ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన పల్లకిలో శయనిస్తున్న శ్రీనివాసుడి ఇరువైపుల గరుఖ్మంతుడు, హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్ని కృష్ణుడు, తోటలో మిత్రులతో కలిసి మామిడిపండ్లను తింటున్న చిన్ని కృష్ణుడు, బాల శ్రీ రాముడు, ఆంజనేయుడు వంటి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ సెల్ ఫోన్లలో ఈ ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.