ఆంజనేయ స్వామికి హిందువులంతా చాలా ప్రత్యేక స్థానమిస్తారు. శనీశ్వరుడి కారణంగా ఇబ్బంది పడేవారు సైతం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆ దోషాలను పోగొట్టుకుంటారు. ఆంజనేయుడు అంత పవర్ఫుల్. అయితే ఆంజనేయుడికి వివాహమైంది అయినా కూడా ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు. దీని కథ ఏంటో మనం గతంలో తెలుసుకున్నాం. అయితే భార్యతో కలిసి ఆంజనేయ స్వామి కనిపించడం చాలా అరుదు. ఇలా సతీసమేతుడిగా కొలువై ఉన్న ఆలయం ఎక్కడో కాదు.. తెలంగాణలోనే ఉంది. ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.
సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందులో మాత్రమే ఉండడం విశేషం. సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆలయం లేదు. ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు వీఐపీలు ఇక్కడికి వచ్చి సతీసమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు.