ఒకసారి ఒక రాజుగారు గుఱ్ఱంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒకావిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇదివరకు చూడనేలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటికి వెళ్ళిపోయాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి కొట్టాడు. ఆవిడ వచ్చి వాకిలి తీసింది. రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ ‘‘నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా ఉన్నావు అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్ళి చేసుకొని నా రాజ్యానికి రాణిని చేస్తాను’’ అని చెప్పాడు.
ఆమె గుణవంతురాలు, చాలా సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది. ‘‘రాజుగారు తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలిసిపోయి వచ్చి ఉంటారు. శరీరం, మనసు రెండు ఆకలితో ఉంటాయి. మీరు వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కొని రండి అని చెప్పింది. మా ఆయన ఈ అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్ళాడు. మీరు ఇదే ఆకులో భోజనం చెయ్యండి. మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను. భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను’’ అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు. ‘‘నేను ఈ రాజ్యానికే మహారాజును. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నేను భోజనం చెయ్యాలా’’ అని అన్నాడు.
అందుకు ఆమె..‘‘మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే.. మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి అడ్డురాని ఎంగిలి, నా భర్త భోంచేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డువచ్చిందా’’ అని అడిగింది. అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది, ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందులోని నీతి ఏంటంటే… పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడ కూడదు అని అర్థం పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలి ఆకులో భోజనం ఒకటే.