హిందూమతంలో ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా ముందుగా చేసి పని ఒకటే. అది ఇంటి ముందు తోరణాలు కట్టడం. పెళ్లిలో అయితే ఇది మరీ కీలకం. భాజా భజంత్రీల నడుమ తోరణాలు కడతారు. హిందూ సంప్రదాయంలో తోరణాలకు అంతటి ప్రాధాన్యముంది. అసలెందుకు తోరణం కడతారు? అంటే ఇంటి ముందు గుమ్మానికి తోరణం కట్టడం వలన ఇంట్లో సానుకూల శక్తితో పాటు మంచి జరుగుతుందట. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ఆరోగ్యానికి సైతం మేలు జరుగుతుంది. అసలు మామిడి ఆకులతో తోరణాలు కడతారు? వాటి వలన కలిగే ప్రయోజనమేంటో చూద్దాం.
గుమ్మాలకు మామిడి ఆకులను తోరణానికి వినియోగిస్తారు. మామిడి తోరణాలకు విశిష్ట స్థానం ఉంది. వీటిని ఏదైనా పండుగ సమయంలో కానీ.. శుభకార్యాల్లో కానీ తోరణాలుగా కడతారు. ఇలా చేయడం వలన మనం తలపెట్టిన కార్యం చక్కగా పూర్తవుతుందని నమ్మకం. మామిడి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. శుభకార్య సమయంలో ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అలాగే ప్రతికూల శక్తులు బయటకు పంపిస్తుందని భావిస్తున్నారు. గృహప్రవేశ సమయంలో కూడా గుమ్మాలకి ఎక్కువగా మామిడి తోరణాలను కట్టడానికి కారణం ఒకటుంది. అదేంటంటే.. గృహ ప్రవేశ సమయంలో ఇంట్లోకి ఎక్కువమంది వస్తుంటారు. వారి కారణంగా గాలి కలుషితమవుతుంది. దానిని ఈ మామిడి తోరణాలు ప్యూరిఫై చేస్తాయట.