దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే… శివుడు దేవదేవుడు. అంటే… దేవుళ్లకే దేవుడు. కాబట్టి… ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా… పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ… గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు.

ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు. శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం (శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందని శాస్త్రం చెబుతోంది.
