అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హిందువులందరికీ ఈ ఆలయం గురించి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఈ ఆలయం ఉంది.ఈ ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన భక్తులందరూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటారు. ఇంటిలో చేసుకునే వ్రతం కంటే ఇక్కడి స్వామి వారి సన్నిధిలో చేసుకునే వ్రతం మరింత శ్రేష్టమని నమ్ముతారు. మరి సత్యనారాయణ స్వామివారి స్థల పురాణం ఏంటి?
పూర్వం అనరాజు అనే రాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడట. బాధపడిన అనరాజు అడవి బాట పట్టి.. అలా తిరుగుతూ తిరుగుతూ చివరకు రత్నగిరి కొండను చేరి అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తికి సంతోషించిన స్వామివారు ఆయనకు కలలో కనిపించి ”బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది..” అని చెప్పాడట. కొంతకాలానికి ఉండూరు సంస్థానాధిపతికి కలలో స్వామివారు కనిపించి ”రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని చెప్పాడట. వెంటనే కొండపైకి వెళ్లిన ఉండూ సంస్థానధిపతికి ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది. వెంటనే రత్నగిరి కొండపై ఆలయం కట్టించి గుడికి తనకు లభించిన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం.