కన్నుల పండువగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం..

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమ‌వారం వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులకు స్వామివారు స్వర్ణ రథంపై దర్శనమిచ్చారు. ఇక నిన్న ఈ వార్షిక వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహ‌స్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends