వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి.

పరిణయోత్సవంలో రెండవ రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కల్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా నాదశ్వరం ఫై పలికించిన . తరువాత అన్నమాచార్య సంకీర్తన గానం, హరికథ, ఇత్యాది కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.

అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends