శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు విశేష సమ‌ర్ప‌ణ చేప‌ట్టారు. సాయంత్రం 5 గంటలకు స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు.

రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంత‌రం సుగ్రీవుడు, అంగ‌దుడు ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి వారితోపాటు ఆంజ‌నేయ‌స్వామివారికి పుష్ప‌మాల‌లు స‌మ‌ర్పించారు.

Share this post with your friends