పార్వతీదేవికే ఝలక్ ఇచ్చిన నారేళ్ల నాచి గురించి తెలుసా?

నారేళ్లనాచి గురించి దాదాపు ఎవరూ విని ఉండరు. ఆమె కథేంటంటే.. ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి ఆశ్చర్యపోయిందట. చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణమేంటని అడిగిందట. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే బాగా దాన ధర్మాలు చేసిన ‘ఎముక లేని చెయ్యి’ అని అంటారని చెప్పాడు. శివయ్య మాటలు విన్న పార్వతి దేవికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. వెంటనే మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది.

అయిదేళ్ళ తరువాత పార్వతీ దేవికి తాను సాయం చేసిన నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్లి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పిందట. అవమాన భారంతో పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదని శివుడు చెప్పాడట. ఆ తరువాత విష్ణుమూర్తి వద్దకు వెళ్లినా కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి విషయాన్ని తెలిపాడట. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి పెట్టి క్షమించమని కోరిందట. దీంతో సంతోషించిన పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.

Share this post with your friends