తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లోని అరణ్య ప్రాంతాలను సంరక్షిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్రను పోషిస్తోంది. టీటీడీ అటవీ విభాగ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల విస్తీర్ణంలో అరణ్య ప్రాంతం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక (ISFR) ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదు కావడం విశేషం. ఇది దేశంలోనే అత్యుత్తమైన స్థానంలో టీటీడీని నిలిపింది. సుమారు 2431 హెక్టార్లలో అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణకు ముఖ్యంగా దోహదపడుతున్నాయి.

వివిధ అటవీ సిబ్బంది విధులు:
టీటీడీ అటవీ విభాగాన్ని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్లు ఉన్నాయి. ప్రతి రేంజ్ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది సమన్వయంతో అటవీ పరిరక్షణ చేపడుతున్నారు.
