తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఉదయం 05 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.