శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. ఈ తరువాత రామయ్య కోసం నరసింహ తీర్థం నుంచి తీర్థాన్ని తెచ్చారు. ఆ తెచ్చిన తీర్థంతో శ్రీ కోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుంచి శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీరామపట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends