ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. అయితే స్వామివారి కల్యాణాన్ని వీక్షించలేని భక్తులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కల్యాణానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. 500 మంది టీటీడీ డిప్యూటేషన్ ఉద్యోగులు, 2500 మంది శ్రీవారి సేవకులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారు. ఈ ఏడాది సీతారాముల కల్యాణోత్సవంలో విధులు నిర్వహించే సిబ్బందికి నాలుగు సార్లు తిరుపతి శ్వేత భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కళ్లారా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి వీలుగా హెచ్డీ క్యాలిటీతో ప్రత్యక్ష ప్రసారం అందిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. దీనిపై కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితర విభాగాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.