
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక ఆటల పోటీలు నేడు ప్రారంభమయ్యాయి. దీనికి సకల ఏర్పాట్లను టీటీడీ చేసింది. ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో క్రీడల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలు మార్చి 17 తేదీ వరకు జరుగనున్నాయి. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరిగింది.
పురుషులకు, మహిళలకు వేరువేరుగా, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానంలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీ. ఏ. ఆనంద రాజు క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
