తిరుమలలో ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. రెండుమూడు రోజులకో సారి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి.. భక్తులతో సైతం మాట్లాడి ఏమైనా ఇబ్బందులు, సమస్యలుంటే చూస్తున్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టల్లో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు. ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.