
ఇవాళ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 137వ జయంతి ఉత్సవాలను తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్చ కళాశాలలో ఉదయం 10.30 గంటల నుంచి స్మారకోపన్యాస సభ నిర్వహిస్తారు. ఇందులో వేటూరివారి సాహిత్యంపై ప్రముఖ పండితులు ఉపన్యసిస్తారు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా, తొలి తెలుగు పదమైన ‘నాగబు’ను గుర్తించిన పరిశోధకుడిగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా, అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడిగా, అన్నమాచార్య ఉత్సవాల ప్రథమ ప్రారంభకుడిగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు.
