
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 09 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 13వ తేదీ వరకు ఈ సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 09న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
మూడవరోజు మార్చి 11న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగో రోజు మార్చి 12న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా తిరుమల శ్రీవారికి సంబంధించిన పలు సేవలను రద్దు చేయడం జరిగింది. మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
