
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 20, 21వ తేదీలలో తిరుమల పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, గార్డెన్, అన్న ప్రసాదం అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
అనంతరం వెంకయ్య చౌదరి అన్నప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్నప్రసాదం చాలా రుచికరంగా ఉందని, అన్నప్రసాదంలో చాలా మార్పులొచ్చాయని అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈఈ శ్రీ వేణు గోపాల్, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
