ఉజ్జయిని మహాకాళుడు స్వయంగా విచ్చేసి భస్మార్చన అందుకుంటాడు.. కాశీ విశ్వనాథుడు మహాభిషేకం జరిపించుకుంటాడు. శ్రీశైల మల్లికార్జునుడు జ్వాలాతోరణ కాంతుల్లో ప్రకాశిస్తాడు. శివపార్వతులు వివిధ క్షేత్రాల నుంచి విచ్చేసి కల్యాణ శోభతో కటాక్షిస్తారు. కోటిదీపోత్సవంలో హరుని వైభవ దర్శనాలు ఎన్నో ఎన్నెన్నో. మరే ఉత్సవంలోనూ ఇటువంటి శోభ కానరాదంటే అతిశయోక్తి కాదు. ప్రధాన వేదికపై కొలువుదీరిన పరమేశ్వరుడిని చూడగానే తాము కైలాసంలో ఉన్నామని భక్తుల భావన. తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. దేశవ్యాప్త శైవక్షేత్రాల నుంచి ఆదిదంపతులు ఉత్సవమూర్తుల రూపంలో కోటిదీపోత్సవ ప్రాంగణంలోకొలువుదీరతారు.

కార్తికమాసంలో శివక్షేత్రాలు దర్శిస్తే అనంతకోటి పుణ్యఫలమని భక్తులు భావిస్తారు. వ్యయప్రయాసలతో ఎక్కడెక్కడికో వెళ్లే అవసరం లేకుండా ఆ భాగ్యాన్ని భక్తిటీవీ కోటిదీపోత్సవం తీరుస్తోంది. శ్రీశైలం, వారణాసి, ఉజ్జయిని, అరుణాచలం, చిదంబరం, శ్రీకాళహస్తి, వేములవాడ, అలంపురం, తదితర అనేక శైవ క్షేత్రాల దేవతామూర్తులను కోటిదీపోత్సవంలో దర్శించుకోవచ్చు.
జ్యోతి స్వరూపుడైన పరమాత్ముని సాక్షిగా… కోటి దీపాలు వెలిగించి… తరిద్దాం. కార్తిక మాసం పవిత్రతను దశదిశలా చాటి చెప్పే దివ్యమైన ‘కోటి దీపోత్సవం’ మహా క్రతువుకు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయవలసిందిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
పవిత్ర నదీ జలాలతో మహాశివునికి అభిషేకాలు. కోటి దీపాలతో అఖండ జ్యోతి ప్రజ్వలన. ప్రతిరోజూ వివిధ దేవతా మూర్తుల కళ్యాణాలు. పండితుల వేద ఆశీర్వచనాలు, ప్రవచనాలు. ప్రసిద్ధ కళాకారులచే భక్తి గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని, సకల పుణ్య ఫలాలను పొంది, భగవదనుగ్రహానికి పాత్రులు కమ్మని కోరుకుంటున్నాము.
కార్యక్రమ వివరాలు : నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు.ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.
