
గరుడ పంచమిని ఈ నెల 29న దేశమంతా జరుపుకోనుంది. విష్ణువుకు అత్యంత గొప్ప, ప్రియ భక్తుడు, పక్షి వాహకుడు అయిన గరుడ జననాన్ని గుర్తు చేసుకుంటూ మనమంతా ఈ పండుగను జరుపుకుంటాం. గరుడ పంచమిని ఎప్పుడు జరుపుకుంటామంటే.. శ్రావణ మాసంలో క్షీణిస్తున్న చంద్రుడి ఐదవ రోజును గరుడ పంచమిగా అత్యంత వైభవంగా జరుపుకుంటాం. కశ్యప ముని కుమారుడైన గరుడుడు… సాల్మలి ద్వీపం అని పిలవబడే గ్రహం మీద నివసిస్తున్నాడు. ఆ గ్రహంపై ఉంటూనే నిరంతరం శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసేవాడు.
ఆ తరువాత విష్ణుమూర్తి వాహనంగా మారాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో – వైనతేయశ్చ పక్షిణం అంటే.. “పక్షులలో, నేను గరుడుడిని” అని చెప్పాడు. గరుడుడు నిత్యం విష్ణుమూర్తిని తన వీపుపై మోస్తాడు. కాబట్టి ఆయనను అన్ని వాహకులకు అగ్రగణ్యుడిగా పరిగణిస్తారు. గరుడిని రెండు రెక్కలను సామవేదంలోని రెండు విభాగాలతో పోలుస్తారు. గరుడుడు తన రెక్కలను ఆడించినప్పుడు సామవేదం నుంచి శ్లోకాల జపం మనకు వినిపిస్తుందట. గరుడుడిని పక్షిరాజ, వైనతేయ, సుపర్ణ, గరుత్మాన్, పెరియ తిరువడి, వినతసుత, విష్ణువాహన, నాగంతక, కశ్యపేయ వంటి పేర్లతో సైతం పిలుస్తారు. గరుడకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే మనం గరుడ పంచమిని అత్యంత వైభవంగా జరుపుకుంటాం.
