
ఢిల్లీ సమీపంలోని బృందావనంలో కాత్యాయనీ దేవి విగ్రహాన్ని గోపికలు తయారు చేశారని చెప్పుకున్నాం. అయితే అసలు గోపికలు ఎందుకు అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారనడానికి శ్రీమద్ భాగవతంలో ఒక కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 11 సంవత్సరాల 56 రోజులు బృందావనంలో ఉన్నాడు. ఆ సమయంలో గోపికలతో కన్నయ్య ఆడుకుంటూ బాల్యాన్ని గడిపాడట. ఆ సమయంలో కన్నయ్య చేసే చిలిపి పనులకు ముగ్దులైన గోపికలు కృష్ణుడిని భర్తగా పొందాలనే కోరిక పుట్టిందట.
గోపికలు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ మాత విగ్రహాన్ని తమ చేతులతో తయారు చేసి పూజించారట. గోపికల ఆరాధనకు సంతోషించిన అమ్మవారు వారిని అనుగ్రహించిందట. అఘాసురుడిని సంహరించిన తరువాత ఒక సంవత్సరం విరామం దొరికిందట. ఆ సమయంలో గోపికలందరినీ కన్నయ్య వివాహం చేసుకున్నాడని నమ్మకం. అనంతరం కన్నయ్య మధురకు వెళుతున్న తరుణంలోనూ ఈ ఆలయానికి వచ్చి కంసుడి వధ గురించి తెలిపుతూ ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాడట. ఆ తరువాత కోరుకున్న ఫలితాలను సాధించాడు.
