
ఒక ప్రాంతానికి ఒక అధిపతి ఉన్నట్లుగా ప్రకృతి శక్తులకీ, కాలశక్తులకీ అధిపతులుంటారు. వారు అత్యంత సూక్ష్మరూపులు (శక్తి స్వరూపమే సూక్ష్మం కదా!). వారినే దేవతలంటారు. అలా తిథి, వార, నక్షత్రాదులకు అధిష్టాన దేవతాశక్తులు ఉంటాయి. ఒక రాజ్యంలో సంపద కావాలంటే దానిని ఏలే రాజుగారి అనుమతీ, అనుగ్రహం కావాలి. అలాగే ప్రకృతి శక్తీ, కాలశక్తీ మనకు అనుకూలించాలంటే వాటి అధిపతులైన దేవతల అనుగ్రహం కావాలి. అందుకే, కాలం మలుపులో ఆ దేవతలందరినీ స్మరించి ప్రార్థిస్తాం.
‘తిథి’ మొదలైనవి స్మరించడం చేత ఆ దేవతలు సంతోషించి దీవిస్తారు. కాలాన్ని జడంగా కాక, మనల్నీ విశ్వాన్నీ శాసించే మహాశక్తిగా దర్శించిన విజ్ఞానంలోని సంప్రదాయ బలమిది.’బ్రాహ్మణులు’ అంటే సమాజంలో మేధావులు. వారు ఎవరైనా కావచ్చు. సత్త్వగుణ సంపన్నులైన మేధావులే ‘బ్రాహ్మణులు’ అనేది అచ్చమైన వైదిక నిర్వచనం, వీరు ఏ దేశపు సమాజంలోనైనా ఉంటారు. యజ్ఞద్రవ్యాలను సమకూర్చి, పాడీ పంటా నిలిపే సత్త్వగుణ జంతువులు గోవులు. సత్త్వగుణం, మేధ – ఈ రెంటినీ కాపాడితే దేశానికి క్షేమం. మేధావులు లోకక్షేమాన్ని కోరే సత్త్వగుణ సంపన్నులు. వారు లోకశ్రేయం కోసం ధర్మాన్ని, సత్యాన్నీ చెప్పడానికి భయపడకూడదు.
