
అజ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితమైన రోజు. ఆ రోజున వ్రతమాచరిస్తే ఎంతటి కష్టాలైన పోతాయట. ఈ వ్రతాన్ని అత్యంత కష్ట కాలంలో ఉండగా హరిశ్చంద్రుడు, ఆయన భార్య సత్యవతి ఆచరించారట. అజ ఏకాదశి గురించి శ్రీకృష్ణ పరమాత్మున్ని యుధిష్టరుడు అభ్యర్థించాడట. ఆ అభ్యర్థన మేరకు శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అని శ్రీకృష్ణుడు పేరు పెట్టాడని చెబుతారు. హరిశ్చంద్రుడు శ్మశాన వాటికలను చూసుకునేవాడు. ఒకసారి ఊహించని విపత్తు కారణంగా హరిశ్చంద్రుడు ఉంటున్న రాజ్యంలో దారుణ సంక్షోభం చోటు చేసుకుందట. ఈ కష్టాలకు తోడు హరిశ్చంద్రుని కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు.
హరిశ్చంద్రుడి భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకురాగా.. తన విధిని నిర్వర్తించాడట. మొత్తానికి హరిశ్చంద్రుడు అయితే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడట. ఏం చేయాలో తెలియలేదట. దీంతో విసిగి వేసారిపోయిన హరిశ్చంద్రుడు పరిహారం కోసం గౌతమ మునిని ఆశ్రయించాడు. అప్పుడు గౌతమ ముని శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి, ఉపవాసం ఉండటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పాడట. వెంటనే హరిశ్చంద్రుని దంపతులు ఆ వ్రతం ఆచరించారట. దీంతో వారి కష్టాలన్నీ తొలగిపోయాయట. కాబట్టి ఈ వ్రతం ఆచరించిన వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయట.
