
శ్రీవారి ఆలయాల్లో ఉన్న మండపాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఉన్న పైకప్పు, స్థంభాలపై కృష్ణస్వామివారు, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర దేవతా మూర్తులు, లక్ష్మీదేవి అమ్మవారి వివిధ రూపాలు, జంతువులు, లతలు, పుష్పాలతో కూడిన శిల్పాలతో నిర్మించారు. ప్రధాన గోపురం లేదా మహాద్వారమును 13వ శతాబ్ధంలో నిర్మించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వేలాడదీయబడి ఉంటుంది.
ఇక శ్రీవారి గర్భాలయం గురించి చెప్పాలంటే.. కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ”ఆనంద నిలయం” అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”….స్థానకమూర్తి….” అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”….ధ్రువమూర్తి….” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.
