పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి_పువ్వును సమర్పిస్తే వస్తుందంటారు. మరి సంపంగి పువ్వుకు అంతటి విశిష్టత ఉంది. సంపంగి పూలతో పూజచేయనివాడు మరుజన్మలో సువర్ణ రత్నాలా హీనుడవుతాడట. ఆయుష్షు కోసం దుర్వారపూలతో, సంతానంకోసం దత్తొరపూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది.
చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలిపూవులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు, శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిరమాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా చెట్టు నుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము. కానీ, కొన్ని పుష్పాలను కొన్ని రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడా పూజకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు కలువ పూలను ఐదు రోజుల వరకు, కమలాలను పదకొండు రోజుల వరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వినియొగించవచ్చని ‘భవిష్యపురాణం’ పేర్కొంటోంది. బిల్వ పత్రాలను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయొగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది.