మామలేశ్వర్ ఆలయ విశేషాలేంటంటే..

కశ్మీర్‌లోని పహల్గాంలో కొలువైన మామలేశ్వర్ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆలయం గురించి కల్హణుడు రాజతరంగిణిలో ప్రసావించాడని చెబుతారు. రాజతరంగిణి ప్రకారం ఇది 8వ శతాబ్దానికి ముందే నిర్మించబడింది. అంతేకాకుండా మునులు, ఋషులు, సాధకులు ఇక్కడే ధ్యానం చేసేవారట. మామలేశ్వర్ ఆలయం లిడ్డర్ నది ఒడ్డున పహల్గామ్‌లోని ఒక అందమైన లోయలో ఉంటుంది. దీని సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి కలిసి ఉంటాయి కాబట్టి ధ్యానానికి ఇది అతి ముఖ్యమైనదని చెబుతారు. ఇక్కడ అందమైన రాతి శిల్పాల నడుమ జల్‌కుండ్‌తో పాటు పవిత్రమైన శివలింగం కూడా ఉంటుంది.

మామలేశ్వర్ ఆలయ నిర్మాణాన్ని పురాతన రాతితో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయంలో మహా శివరాత్రి, శ్రావణం, కార్తీక మాసాల్లో పెద్ద ఎత్తున పూజలు, జాగరణలు, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను చేపడతారు. ముఖ్యంగా త్వరలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర పహల్గాం నుంచే ప్రారంభమవుతుంది. మామలేశ్వర్ ఆలయం అదే మార్గంలో ఉంది కాబట్టి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే శివ భక్తులు ఇక్కడికి వెళ్లి శివయ్యను దర్శించుకుని యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడి నీటి సరస్సు అద్భుతంగా ఉంటుంది. దీనిలో స్నానం చేస్తే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

Share this post with your friends