తిరుమలలో ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వార్షిక లెక్కలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే. శ్యామలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు.
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు. సాయంత్రం పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు, ముఖ్య అర్చకులు శ్రీ కిరణ్ స్వామి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.