మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన నిజమైన కథ ఇది..

హృదయాన్ని హత్తుకునే కథ “ది లాస్ట్ పెన్” అనువాద కథ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తర ద్వారం వద్ద మొదలైన ఒక యథార్థ గాథను వివరిస్తుంది. పెరియసామి అనే 80 ఏళ్ల వ్యక్తి.. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పసుపు రంగు చదరపు వస్త్రాన్ని పరిచి, దానిపై పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, కంపాస్ బాక్సులను సర్దుకుని కూర్చునేవాడు. అది ఒక పేవ్‌మెంట్ షాపు (కాలిబాటపై ఉండే దుకాణం). కానీ వ్యాపారం పెద్దగా సాగేది కాదు. పెరియసామికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పిల్లలు పెన్ను కోసం వస్తే, ఆయన మొదట “ఈరోజు నీకు పరీక్షా?” అని అడిగేవాడు. ఒకవేళ ఆ పిల్లవాడు, “అవును తాతా, ఈరోజు నాకు లెక్కల పరీక్ష ఉంది. పెన్ను మర్చిపోయాను” అని చెబితే… వెంటనే పెరియసామి తన దగ్గరున్న వాటిలో ఒక మంచి పెన్ను తీసి ఇస్తూ, “ఇదిగో, ఇది నీ అదృష్ట కలం. వెళ్లి 100 మార్కులు సాధించు” అనేవాడు. డబ్బు కూడా తీసుకునేవాడు కాదు.

మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన నిజమైన కథ ఇది..
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన నిజమైన కథ ఇది..

“డబ్బులు తర్వాత ఇవ్వొచ్చు కన్నా. ముందు పరీక్ష రాయి. నీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పు, అప్పుడు డబ్బులు ఇద్దువు గాని” అని పంపించేసేవాడు. ఆ పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి వచ్చేవారు కాదు. పెరియసామి కూడా వారిని అడిగేవాడు కాదు. ఆయన భార్య తంగం “మీకేమైనా పిచ్చా? ఒక్కో పెన్ను పది రూపాయలు. ఇలా అందరికీ ఉచితంగా ఇచ్చేస్తుంటే మనం ఏం తింటాం? ఇంటి అద్దె ఎలా కడతాం?” అని కోప్పడుతూ ఉండేది. పెరియసామి తన పాత డైరీని తీసి చూపించేవాడు. అందులో తేదీల వారీగా ఎవరికి పెన్ను ఇచ్చింది రాసుకుని ఉండేవాడు. ఆ బాకీలన్నీ కలిపితే సుమారు 3,000 ఎంట్రీలు… అంటే ముప్పై వేల రూపాయల బాకీ. “చూడు తంగం, ఇది అప్పు కాదు… పెట్టుబడి. ఏదో ఒక రోజు ఇది తిరిగి వస్తుంది” అనేవాడు పెరియసామి.

“మీ పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. మీకు ముసలితనం వచ్చేసింది, ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు?” అని తంగం నిట్టూర్చేది. ఇరవై ఏళ్లు గడిచాయి. పెరియసామికి ఇప్పుడు 80 ఏళ్లు. కళ్లు మందగించాయి, వినికిడి తగ్గింది. అయినా ప్రతిరోజూ అదే ఆలయ ద్వారం వద్ద, అదే పసుపు వస్త్రం మీద పెన్నులు పెట్టుకుని కూర్చునేవాడు. కానీ ఇప్పుడు వ్యాపారం అస్సలు లేదు. పిల్లలంతా జెల్ పెన్నులు వాడుతున్నారు, అన్నీ ఆన్‌లైన్ అయిపోయాయి. ఒకరోజు ఉదయం, ఆలయ ద్వారం వద్ద ఒక ఖరీదైన కారు ఆగింది. కోటు, టై ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి చేతిలో పూలగుచ్ఛంతో కారు దిగాడు. నేరుగా పెరియసామి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. “తాతా… నన్ను గుర్తుపట్టారా?” పెరియసామి కళ్లు చికిలించి చూస్తూ, “నాయనా… ముసలివాణ్ణి అయిపోయాను, కళ్లు సరిగా కనబడటం లేదు” అన్నాడు.

“తాతా… 18 ఏళ్ల క్రితం, నా 10వ తరగతి మ్యాథ్స్ పరీక్ష రోజున నా పెన్ను విరిగిపోయి, చేతిలో పైసా లేక ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు ఈ పెన్ను ఇచ్చి, ‘ఇది నీ లక్కీ పెన్, వెళ్లి 100 మార్కులు తెచ్చుకో’ అని పంపారు. డబ్బులు కూడా తీసుకోలేదు.” పెరియసామికి పాత జ్ఞాపకాలు మెదిలాయి. “నేను మురుగన్‌ను తాతా. ఆ పెన్నుతోనే పరీక్ష రాసి 98 మార్కులు సాధించాను. కాలేజీకి వెళ్లాను, ఈరోజు నేను ‘పెన్నా టెక్నాలజీస్’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమానిని. నా జీవితం మీరు ఇచ్చిన ఆ పెన్నుతోనే మొదలైంది.” అని చెప్పాడా వ్యక్తి. గుమ్మం దగ్గర నిలబడి వింటున్న తంగం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మురుగన్ ఒక కవరు తీసి ఇచ్చాడు. “తాతా, ఆరోజు నేను మీకు పది రూపాయలు బాకీ పడ్డాను. ఈరోజు దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తున్నాను.” అని చెప్పాడు. లోపల పది లక్షల రూపాయల చెక్కు ఉంది. పెరియసామి చేతులు వణకసాగాయి. “నాయనా… నాకు డబ్బు వద్దు. నువ్వు గొప్పవాడివయ్యావు, అదే నాకు చాలు.” అన్నాడు. “లేదు తాతా, ఇది డబ్బు కాదు. మీ ‘పెట్టుబడి’ లాభాలతో తిరిగి వచ్చింది. ఇక మీరు కాలిబాటపై కూర్చోనక్కర్లేదు. మీ బాధ్యత నాది.” అని చెప్పాడా వ్యక్తి.

మరుసటి రోజు పేపర్లలో హెడ్ లైన్‌గా “కాలిబాటపై పెన్నులు అమ్మే తాతకు సాఫ్ట్‌వేర్ అధినేత పది లక్షల గురుదక్షిణ.” అని వచ్చింది. ఆ వార్త చదివి మరుసటి రోజు ఇంకొక కారు వచ్చింది. “తాతా, నేను సుమతిని. హిందీ పరీక్ష కోసం మీ దగ్గర పెన్ను తీసుకున్నాను. ఇప్పుడు నేను హిందీ టీచర్‌ని.” తర్వాత రమేష్ వచ్చాడు. “తాతా, నేను ఇప్పుడు ఆడిటర్‌ని. నా మొదటి బ్యాలెన్స్ షీట్ మీ పెన్నుతోనే రాశాను.” ఒక వారం తిరిగేసరికి ఆ ఆలయ ద్వారం ఒక పెళ్లి ఇల్లులా మారిపోయింది. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసులు… క్యూ కట్టి వచ్చి పెరియసామి కాళ్లకు నమస్కరించి, పూలు, పండ్లు, బహుమతులు ఇచ్చారు. తంగం పాత డైరీ తీసింది. మూడు వేల ఎంట్రీలు… ముప్పై వేల రూపాయల బాకీ. కానీ ఇప్పుడు తిరిగి వచ్చింది మూడు కోట్లకు పైగానే! పెరియసామి కన్నీళ్లతో “తంగం… నేను నీకు చెప్పాను కదా, ఇది అప్పు కాదు, ఇది మనం ప్రేమతో చల్లిన విత్తనం. ఇప్పుడు అది ఒక మహావృక్షమై అడవిలా పెరిగింది.” అన్నాడు.

ఈరోజు మదురై మీనాక్షి ఆలయ ఉత్తర గోపురం వద్ద ఒక పెద్ద స్టేషనరీ షాపు ఉంది. దాని పేరు “పెరియసామి పెన్ స్టోర్”. దానికి అద్దె లేదు, మురుగన్ ఆ స్థలాన్ని కొని ఇచ్చాడు. ఆ షాపులో ఒక బోర్డు “పరీక్షలు రాసే విద్యార్థులకు ఇక్కడ పెన్నులు ఉచితం. మీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పండి… డబ్బులు తర్వాత చెల్లించవచ్చు.” అని కనిపిస్తుంది. దాని కింద చిన్న అక్షరాలతో.. “ఒక పది రూపాయల పెన్ను జీవితాన్ని మార్చగలదు. నమ్మండి.” అని ఉంటుంది. మరి ఆ షాపును ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో తెలుసా? సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని మురుగన్! వారానికి రెండు రోజులు తన సూటు, టై తీసివేసి, ఆ దుకాణంలో కూర్చుని పిల్లలకు పెన్నులు ఇస్తుంటాడు. మీరు ఇచ్చేది కేవలం ఒక పెన్ను మాత్రమే కాదు… అది ఒక నమ్మకం. ఏదో ఒక రోజు ఆ నమ్మకం తిరిగి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది… మీరు ఎప్పుడూ పేదవారు కాదు, మీరు ఎప్పుడూ అత్యంత ధనవంతులే అని! మీరు ఎప్పుడైనా మదురై వెళ్తే, ఆ ఉత్తర గోపురం వద్ద ఉన్న “పెరియసామి పెన్ స్టోర్”లో మీ పిల్లల కోసం లేదా మనవల కోసం ఒక పెన్ను కొనండి. ఆ పెన్ను వారి జీవితంలో ఏ అద్భుతాన్ని సృష్టిస్తుందో ఎవరికి తెలుసు!

Share this post with your friends