
శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి. గరుత్మంతుడు సూర్య రథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్ర మథనంలో ‘ఉచ్పైశ్రవం’ అనే గుర్రం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు.
ఓ రోజు వినత ఆమె తోటికోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ, వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకొన్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే కద్రువకు వినత దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరగా.. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది. ఒక కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
