
ఒకప్పుడు పూరి జగన్నాథుడికి వేప పొడిని నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. స్థానికంగా నివసించే ఒక వృద్ధ మహిళ. జగన్నాథుడికి ప్రతిరోజూ 56 రకాల నైవేద్యాలను సమర్పించడం, తినడం చూసేదట. మరి ఇన్ని నైవేద్యాలు తింటున్న స్వామికి ఎక్కడ అరగక కడుపునొప్పి వస్తుందోనని భావించిన ఆ వృద్ధురాలు.. స్వామివారి కోసం ఇంటి నుంచి వేప పొడిని తయారు చేసి తీసుకొచ్చిందట. కానీ ఆలయ ద్వారపాలకుడు ఆమెను లోపలికి అనుమతించకపోగా.. ఆమె తీసుకొచ్చిన వేప పొడిని పారబోశాడట.
అదే రోజు రాత్రి పూరి రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. తన భక్తురాలు తన కోసం చాలా ప్రేమతో తెచ్చిన వేప పొడిని, ఆమెను ద్వార పాలకుడు ఆలయం లోనికి రానివ్వలేదని చెప్పాడట. మరుసటి రోజు రాజే స్వయంగా ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి తన కల గురించి చెప్పి వేప పొడిని తయారు చేయమని చెప్పాడట. వెంటనే ఆమె జగన్నాథుడి కోసం వేప పొడిని తయారు చేసి ఇచ్చిందట. నాటి నుంచి నేటి వరకూ స్వామివారికి సమర్పించే ప్రసాదాలలో వేప పొడిని సైతం చేర్చారు. ఇది స్వామివారికి వేప పొడిని సమర్పించడం వెనుక ఉన్న కథ.
