
చాతుర్మాస వ్రతం గురించి ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల పాటు మనం చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తాం. అయితే నాలుగు నెలల్లో ఒక్కో నెలలో ఒక్కొక్క వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? ఈ వ్రతం వెనుక ఉద్దేశమేంటో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించేవారు గ్రామాల్లో సంచరించకూడదని చెబుతారు. దానికి కారణం.. వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు.
అందువల్ల ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్ చింతనతో పాటు ధర్మ ప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
