
ఆధ్యాత్మికతకు నెలవైన మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక యాత్రలు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. ఆలయాలకు వెళ్లి తమ శక్తి మేరకు హుండీలో నగదో.. కానుకలనో వేస్తారు. నిత్యం కొన్ని వేల మంది ఆలయాలకు వెళ్లి తమ కోరికను చెప్పి.. అది తీరిన వెంటనే మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఇలా ఆలయాలకు ఏటా ఎంత ఆదాయం సమకూరుతుందో మాటల్లో చెప్పడం కష్టం. తిరుమల వంటి కొన్ని దేవాలయాల సంపాదనతో మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మార్చుకోవచ్చట. ఆలయాల నుంచి అంతటి ఆదాయం సమకూరుతుంది.
తిరుమల తిరుపతి క్షేత్రం, వైష్ణో దేవి ఆలయం, కేరళలోని త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం.. ఇలా దేశంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాలకు భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు సమర్పిస్తుంటారు. నిత్యం కోట్లాది రూపాయల హుండీ ఆదాయం ఈ ఆలయాలకు సమకూరుతుంది. త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం దేశంలోని అత్యంత ధనిక ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో నేలమాలిగలు ఉన్నాయి. ఇక్కడ ఆరు ఖజానాల్లో 20 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తితో పాటు విష్ణుమూర్తి బంగారు విగ్రహం ఉంది. ఈ విగ్రహం విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా.
