కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య కర్కాటక లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. నేడు మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
ఇక నిన్న నాలుగవ రోజైన శనివారం ఉదయం 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక నిన్న సాయంత్రం ఆర్జితకళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించారు.