కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. కాగా నేటి ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై కనువిందు చేశారు. ఇవాళ సాయంత్రం సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఇవాళ సాయంత్రం స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవం సైతం జరగనుంది.
నిన్న ఉదయం సింహ వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు 6వ తేదీన ధ్వజారోహణంతో ముగియనున్నాయి. జూన్ 7వ తేదీన స్వామివారికి మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.