వైభవంగా చామంతి పుష్పాల‌తో శ్రీబాలాంజనేయ స్వామివారికి విశేష‌ అభిషేకం

ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి ఆలయంలో శ్రీ బాలాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూన్ ఒకటవ తేదీన స్వామివారి జయంతి నాటి నుంచి జూన్ 5 వరకూ ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 8 :30 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ స్వామివారికి చామంతి పుష్పాలతో విశేష అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు ఆంజ‌నాద్రి, ఆకాశగంగ శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మస్థలం, స్వామివారి వైభ‌వం గురించి వివరించారు. మొదటి రోజు జూన్ 1వ తేదీన మల్లెపూలతో అభిషేకం నిర్వహించారు. జూన్ 2వ తేదీన తమలపాకులతో అభిషేకించారు.

తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో సోమ‌వారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన‌ క‌న‌కాంబ‌రం, సింధూర వ‌ర్ణగ‌న్నేరి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు. జూన్ 3వ తేదీన ఎర్రగన్నేరుతోనూ.. కనకాంబరం పుష్పాలతో స్వామివారి అభిషేకించారు. ఇక రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. చివరి రోజైన జూన్ 5వ తేదీన సింధూరంతో అంజనాద్రి శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శ్రీ ఆంజనేయ సహస్రనామార్చనలతోపాటు అత్యంత వైభవంగా మంత్రోచ్ఛారణల నడుమ హనుమాన్ జయంతి వేడుకలు ముగియనున్నాయి.

Share this post with your friends