శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం.. సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా అదొక ముళ్లబాట. తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన పడిన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కన్నయ్య కాలం గడిపాడు. కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులు చెరసాలలో మగ్గిపోయారు.
కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసపోయాడు. ఆ తరువాత కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా పూతన హత్యా ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి ఆయనకు దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా – శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళకే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా.