కశ్మీర్లోని పహల్గాం ప్రకృతి అందాలకే కాకుండా ఆధ్మాత్మికతకు కూడా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి కశ్మీర్ లోయలోని పురాతన ఆలయాలలో మామలేశ్వర్ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చారిత్రకంగానూ ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని రాజా జయసింహ కాలంలో నిర్మించారని.. ఇక్కడి శివలింగాన్ని సైతం రాజా జయసింహే ప్రతిష్టించారని చెబుతారు. ఈ గుడిలోని శివలింగం ఒక నీటి బుగ్గలో ఉంటుందట. ఈ శివలింగం అత్యంత మహిమాన్వితమైనదని.. భక్తులు ఏం కోరకున్నా తప్పక నెరవేరుతుందని చెబుతారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా మామలేశ్వర్ ఆలయానికి వచ్చి తప్పక శివయ్యను దర్శించుకుంటారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఇక్కడ అన్ని శివాలయాల్లో మాదిరిగానే నంది ఉంటుంది కానీ అది రెండు ముఖాలతో ఉంటుంది. పార్వతి దేవి ఇక్కడే పరమ శివుడిని వివాహం చేసుకునేందుకు తపస్సు చేసిందట. ఆ తరువాత శివయ్యను భర్తగా పొందిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం శివ-పార్వతిల కలయికను సూచిస్తుంది. అందుకే భక్తులు ఈ ఆలయాన్ని శివ,పార్వతుల ప్రేమకు చిహ్నంగా చూస్తారు.