
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి 13 కి.మీ దూరంలో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో స్వామివారి దేహం సర్పం మాదిరిగా పొలుసులతో ఉంటుందని తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయం గురించి ఇంకా చాలా ఆసక్తికర విషయాలున్నాయి. చెరువులో లభ్యమైన స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ప్రారంభించారు. శిలారూపంలో గల స్వామి వారి విగ్రహం చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం కూడా ఉంది.
స్వామివారి మూలవిరాట్టు వద్దకు నిత్యం ఒక పాము రాత్రి వేళ వచ్చి మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందట. ఈ విషయాన్ని ఆలయ అర్చకులు చెబుతుంటారు. అంతేకాకుండా నెలకోమారు ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందట. దానిని ఆలయ అర్చకులు తీసుకెళ్లి స్వామివారి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారట. ఆలయ ఆవరణలో మనకు స్వామి వారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఇక షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి.
