శివయ్య నామ స్మరణ చేస్తే ఈ చెరువులోని నీరు వేగంగా కదిలి ఉప్పొంగుతాయట..

ఉత్తరాఖండ్.. పురాతన ఆలయాలకు నెలవు. ఇక్కడ అద్భుతమైన.. అబ్బురపరిచే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చార్దామ్‌లలో ఒకటైన కేదారనాథ్ ఒకటి. ఈ దేవాలయాలలో చెరువులు, సరస్సులు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక ఆసక్తికరమైన.. షాకింగ్ చెరువు గురించి చెప్పుకుందాం. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే శివ నామస్మరణ చేస్తే చాలు నీరు స్పందిస్తుంది. వేగంగా కదులుతూ ఉప్పొంగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో సరస్వతి నది ఒడ్డున ఉందీ రేటాస్ కుండ్. ఈ చెరువు ఎలా ఏర్పడిందనేది కూడా ఆసక్తికరమే. కామ దేవుడి భార్య రతీదేవి కంటి నీటితో ఈ చెరువు ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.

అసలు కథ ఏంటంటే.. శివుడి తన మూడో నేత్రం తెరవడంతో కామదేవుడు భస్మమయ్యాడట. దీంతో ఆయన భార్య రతీ దేవి ఏడుస్తూ ఉండేదట. అలా ఆమె కన్నీరు ఓ చెరువుగా మారిందట. అదే రేటాస్ చెరువు. ఇక్కడ శివుడిని భీముడు పూజించాడని చెబుతారు. ఈ చెరువులోని నీటిని సేవిస్తే శివయ్య అనుగ్రహం కలిగి మన కోరికలన్నీ నెరవేరుతాయట. ఇక నీరు ఉప్పొంగడం మాటేంటంటారా? ఎవరైనా సరే శివుడిని స్మరిస్తే వేగంగా కదులుతూ ఉప్పొంగి నీటిపై బుడగలు ఏర్పడతాయట. భక్తులు కోరిక కోరుకుని ఇక్కడ శివుడిని స్మరిస్తే ఈ చెరువులో బుడగలు వస్తే తప్పక కోరిక నెరవేరుతుందట. లేదంటే నెరవేరదట. 2013లో సంభవించిన ప్రకృతి విపత్తులలో కనుమరుగైన కుండాల్లో రెటాస్ ఒకటి. అంతరించి పోయిన తర్వాత కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు.

Share this post with your friends