భారతదేశంలో అడుగడుగునా ఏదో ఒక దేవుడి ఆలయం ఉంటుంది. మన దేశం ఆచారాలు, సంప్రదాయాలకు పుట్టిల్లు. దేశంలో అనేక ఆసక్తికర ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో రాంపూర్ తహసీల్లో ఉన్న శ్రీ కోటి మాత ఆలయం కూడా ఇలాంటిదే. ఈ ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ భార్యాభర్తలు కలిసి పూజ చేస్తే విడిపోతారట. కాబట్టి ఇక్కడసలు భార్యాభర్తలను కలిసి ఎట్టిపరిస్తితుల్లోనూ పూజ చేయనివ్వరు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. భార్యాభర్తలు కలిసి పూజ చేయడంపై ఇక్కడ నిషేధం ఉంది.
ఇక్కడ కలిసి పూజ చేసిన జంటలు విడిపోవడమే కాదు.. వారికి ఏదో ఒకటి చెడు జరుగుతుందట. దుర్గాదేవి 51 శక్తి పీఠాలకు శ్రీ కోటి మాత ఆలయానికి ఎలాంటి సంబంధమూ లేదు. అయితే దానికున్న గుర్తింపు మాత్రం ఏ శక్తి పీఠం కంటే కూడా తక్కువ కాదు. నవరాత్రి సమయంలో ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఎంతమంది భక్తులు ఇక్కడకు వచ్చినా కూడా భార్యాభర్తలు విడిగా దర్శనం చేసుకుంటారు తప్ప కలిసి మాత్రం దర్శించుకోరు. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆలయం ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్లా ఉంటుంది.