శ్రీ కోటి మాతను జంటలు కలిసి ఎందుకు సందర్శించకూడదు?

హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీ కోటి మాత పేరుతో ప్రసిద్ధి గాంచిన అమ్మవారిని జంటలు ఎందుకు సందర్శించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన గణేశుడు, కార్తికేయుడిని విశ్వాన్ని చుట్టి రావాలని కోరిన కథ తెలిసిందే. తల్లిదండ్రుల ఇద్దరి మాట విన్న కార్తికేయుడు వెంటనే తన వాహనంపై విశ్వ సందర్శనకు వెళ్లాడు. గణపతి మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వారే తమ విశ్వమని చెప్పి తల్లిదండ్రులను సంతోషపరిచాడు. ఇప్పుడు ఈ ఆలయం వెనుక ఉన్న కథ కూడా కార్తికేయుడికి సంబంధించినదే.

కార్తికేయుడు వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుని దానిని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే పార్వతీదేవి తన కొడుకు నిర్ణయంతో కలత చెందింది. అప్పుడు ఈ ప్రదేశంలో తనను సందర్శించడానికి వచ్చే భార్యాభర్తలు ఒకరినొకరు విడిపోతారని శపించిందట. అందుకే ఇక్కడ భార్యాభర్తలు పొరపాటున కూడా కలిసి పూజలు చేయడం కానీ.. అమ్మవారిని దర్శించుకోవడం కానీ చేయరట. అలాగని భార్యాభర్తలు ఇక్కడి అమ్మవారి దర్శనానికి రాకుండా అయితే ఉండరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని విడివిడిగా దర్శించుకుని వెళతారు. ఈ ఆలయంలో సతీసమేతుడైన గణపతిని మనం ఇక్కడ చూడవచ్చు.

Share this post with your friends