కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఇవాళ దేశమంతా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అర్థరాత్రి నుంచే కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఇస్కాన్ టెంపుల్స్‌ను జన్మాష్టమి సందర్భంగా విద్యుద్దీప అలంకరణతో మెరిసి పోతున్నాయి. దక్షిణాయనంలో శ్రావణమాసం కృష్ణపక్షం అర్థరాత్రి అష్టమి తిథి రోహణి నక్షత్రంలో దేవకి గర్భాన కన్నయ్య జన్మించాడు. ముఖ్యంగా కృష్ణుడు జన్మభూమి అయిన మధుర, బృందావనంలో కృష్ణాష్టమి వేడుకలు అయితే అంబరాన్నంటుతాయి. ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ శ్రీ కృష్ణుడికి అద్భుతమైన ఆలయాలున్నాయి.

దక్షిణాదిలోనూ కన్నయ్య జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో స్థానిక యాదవ పూజరుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. జానపద తరహాలో శ్రీకృష్ణ, గొల్లభామ వేషధారణలతో ఆలయ ప్రాంగణంలో యాదవ పూజారులు ఉట్టి కొట్టారు. ఆలయ పురవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపును నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ ఈవో, అర్చకులు, యాదవ పూజారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends