మే 22 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

మే 22 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 24వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వసంతోత్సవాలకు.. మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ వసంతోత్సవంలో భక్తులు పాల్గొనవచ్చు. రూ.150 చెల్లించి భక్తులు ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించనున్నారు. మే 14న శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారిని ఉదయం తెల్లవారుజామునే సుప్రభాత సేవతో మేల్కొల్పనున్నారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

Share this post with your friends