
ఎవరైనా సరే.. భగవంతుడిని ముందుగా కోరుకునేది ఆయురారోగ్యాల గురించే కదా.. ముఖ్యంగా ఈ దేవుడిని మాత్రం ఆయుర్దాయం కోసమే దర్శించుకుంటారు. ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి తప్పక ఆయుర్దాయం పెరుగుతుందని నమ్మకం. ఈ ఆలయాన్ని యముడి మరణ స్థలంగా భావిస్తూ ఉంటారు. ఈ గుడి షష్టిపూర్తి వేడుకలకు ప్రసిద్ధి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? అసలు ఆ ఆలయంలో కొలువైన దేవుడు ఎవరు అంటారా? తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని తిరుక్కడయూర్ పట్టణం మైలాదుత్తురైకి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8 కిమి దూరంలో ఉంది.
ఇక్కడ పరమ శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి శివయ్య ‘అమృత ఘటేశ్వరుడు’గా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం షష్టిపూర్తి వేడుకలకు ప్రసిద్ధి అని తెలుసుకున్నాం కదా.. నిత్యం ఇక్కడ దాదాపు 60 వరకూ షష్టిపూర్తి వేడుకలు జరుగుతుంటాయి. ఇక్కడ షష్టిపూర్తి చేసుకుంటే ఇక నిండు నూరేళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించవచ్చని భక్తుల నమ్మకం. ఆలయంలోని ప్రధాన శివలింగానికి ఎడమ వైపున శివుని పాదాలను చుట్టుకున్నట్లుగా మార్కండేయుడు మనకు దర్శనమిస్తాడు. మరోవైపు యముడిని శిక్షిస్తున్నట్లుగా శివయ్య విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోనే మార్కండేయుడు చిరంజీవిగా మారాడట.
