
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ కోసం FIFO (First In First Out) పద్ధతి అమల్లో ఉంది. ప్రస్తుతం ఈ విధానంలోనే మార్పు తీసుకువచ్చింది. ఫిఫో స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి.
డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18వ లేది నుండి 20వ తేది వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులు 180 రోజులుగా నిర్ణయించడం జరిగింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
