తీర్థంలోని రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కషాయ, పంచమృత, పానక తీర్థాల గురించి తెలుసుకుందాం. రాత్రి పూజ తరవాత అభిషేక జలంలో కొన్ని మూలికల రసాన్ని/సారాన్ని కలుపుతారు. దీన్నే కషాయ తీర్థం అంటారు. కొల్హాపురి శ్రీమహాలక్ష్మి, కొల్లూరు మూకాంబిక, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయాల్లో అలా ఇస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల దీర్ఘ రోగాలు త్వరగా నయమవుతాయని నమ్ముతారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం అనే అయిదు” పదార్థాల సమాహారాన్ని పంచామృతం అంటారు. దీనితో ప్రత్యేక సందర్భాల్లో శివుడికి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు.
ఈ పంచామృత తీర్ధ సేవనం వల్ల ఆరోగ్యపరంగా, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు. నరసింహ స్వామికి, శ్రీరాముడికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు. ఇవేకాకుండా తులసి, పచ్చకర్పూర, బిల్వ, గంగాజల, హరిద్రా (పసుపు కలిపిన నీరు), తీర్థాల పేరుతో సందర్భోచితంగా అభిషేకం చేస్తుంటారు. వీటిని సేవించడం వల్ల కూడా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరతాయంటారు. తీర్థాన్ని లోపలికి మూడుసార్లు తీసుకోవాలని పెద్దలు చెబుతారు. ఉద్ధరిణి నిండా తీర్ధం తీసుకుని అరచేతిలో వేసుకుని శిరస్సు మీద ఒక్కసారే చల్లుకోవడాన్ని మార్జన అంటారు. పరిసరాల్లో చల్లేటప్పుడు మామిడి ఆకుల చివరలను తీర్ధమున్న పాత్రలో ముంచుతూ దైవ నామ స్మరణ చేస్తూ చల్లాలి. దీన్ని ప్రోక్షణ అంటారు.