
ఎక్కడైనా శివుడు మనకు లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఒకచోట మాత్రం శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. అది కూడా ఆసక్తికరంగా తలకిందులుగా తపస్సు చేస్తూ పరమేశ్వరుడు దర్శనమివ్వడం విశేషం. అది మరెక్కడో కాదు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో.. ఇక్కడి శివాలయం త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతోంది. ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడిందట. ఇక్కడి ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి.
ఇక్కడి శివుడిని శక్తేశ్వరస్వామిగా భక్తులు కొలుచుకుంటారు. ఇక్కడ శివయ్యతో పాటు కుమారస్వామిని ఒడిలో పడుకోబెట్టుకుని లాలిస్తున్నట్టుగా పార్వతీ మాత విగ్రహం ఒకే పీఠంపై బయటపడింది. అంతేకాకుండా నంది విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు సైతం బయటపడ్డాయి. ఆ తరువాత ఓ ఆలయం కట్టి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడు శీర్షాసనం వేసి యోగ ముద్రలో ఉన్నటువంటి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే ఇక్కడి శివయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.
