
గ్రహణ కాలంలో దర్భలను ఎందుకు వాడతారనేది చాలా మందికి తెలియదు. తులసి, దర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై, ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించ బడుతోంది. దర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి ఉంచడం గమనించవచ్చును. దర్భలని సంస్కృతం లో ‘అగ్ని గర్భం’ అంటారు.
కుంభాభిషేకాలలోను యాగశాలలోని కలశాలలోను, బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్భలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి కొస దాకా సమానంగా ఉంటాయి. పై భాగంలో దళసరిగా వుంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు.
