జూన్ 11న అయోధ్యకాండ 11వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 11వ తేదీన ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ 11వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. అయోధ్యకాండలోని 40 నుంచి 44వ‌ సర్గ వ‌ర‌కూ మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 162 శ్లోకాలు, యోగ‌వాశిష్టం, ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 187 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీవేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రామాయణంలోని విభాగాలను “కాండములు” అంటారు. ఒక్కో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో అయోధ్యా కాండ రెండవ కాండము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధానంగా శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము, వన ప్రయాణం, గుహుని ఆతిథ్యం, చిత్రకూట నివాసం, దశరథుని మరణం, భరతుని దు:ఖం వంటి అంశాలున్నాయి.

Share this post with your friends